హెల్మెట్ తప్పనిసరి – నాగారం ఎస్ఐ చిరంజీవి

నాగారం, జనవరి 6 (విశ్వం న్యూస్): జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నాగారం మండల కేంద్రంలో నాగారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఆయన, హెల్మెట్ వినియోగం ప్రాణరక్షణకు అత్యంత కీలకమని తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు నాగారం మండల వ్యాప్తంగా రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలు, విద్యార్థులు, పౌరులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ప్రయాణ సమయంలో వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అధిక వేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్క్ చేయకుండా క్రమశిక్షణ పాటించాలని తెలిపారు.
ఈ ద్విచక్ర వాహన ర్యాలీ కార్యక్రమంలో స్థానిక పౌరులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.