
హైదరాబాద్, డిసెంబర్ 29 (విశ్వం న్యూస్) :కామారెడ్డి జిల్లాలో ముగ్గురి ఆత్మహత్యల కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్యలకు కారణాలు ఇంకా తెలియలేదు. దీంతో ఈ కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు పోలీసులు. ఇప్పటికే మృతుల సెల్ఫోన్ డేటా, వాట్సాప్ చాటింగ్స్ను పరిశీలిస్తుండగా.. ఇప్పుడు సీసీ టీవీ విజువల్స్ పై ఫోకస్ పెట్టారు. వీరి మధ్య అసలేం జరిగింది? వీరెందుకిలా సూసైడ్ చేసుకోవల్సి వచ్చిందని సస్పెన్స్ నడుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కామారెడ్డిలో ముగ్గురి ఆత్మహత్య ఘటనలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్యలకు నాలుగో వ్యక్తి కారణమా.. అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. నాలుగో వ్యక్తి కోసమే ముగ్గురు మధ్య వాట్సాప్ సంభాషణ జరిగినట్టు భావిస్తున్నారు. బలమైన కారణంగా నిలిచిన నాలుగవ వ్యక్తి ఎవరు..? అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ సూసైడ్ మిస్టరీలో ఇప్పటివరకు ముగ్గురే ఆత్మహత్యకు కారణం అని పోలీసులు భావిస్తుండగా.. నాలుగవ వ్యక్తి వెలుగులోకి వస్తే క్రైమ్ స్టోరీకి పులిస్టాప్ పడినట్లేనని అనుకుంటున్నారు. ఆ నాలుగవ వ్యక్తి వల్లే పోలీసులు సీక్రెట్ విచారణ జరుపుతున్నారని కూడా ప్రచారం జరగుతోంది. పరువు పోవద్దని ఎస్సై సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ అందుకే ఊరి చివరకు వచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే అడ్లూరు ఎల్లారెడ్డి పెద్దచెరువు వద్దకు వచ్చాక ఎవరు ఎవరిని కాపాడే ప్రయత్నం చేశారు ? ఎవరు ముందుగా చనిపోదామని డిసైడ్ అయ్యారు ? నాలుగో వ్యక్తి కోసం జరిగిన గొడవే ఆత్మహత్యలకు కారణమా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. సంచలన విషయాలు, ఆరోపణలకు నివృత్తి చేసే బాధ్యత ఎస్పీ సింధు శర్మ పైనే ఉంది. దాంతో రెండు రోజుల్లో పూర్తి నివేదిక బయటపట్టనున్న తరుణంలో ఎస్పీ సింధు శర్మ ఏం చెప్పబోతుంది ? అని చర్చించుకుంటున్నారు.