కాశ్మీర్ ఉగ్రదాడి మృతులకు ప్రైవేటు టీచర్స్,లెక్చరర్ల నివాళి

- ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
- దాడిని ఖండించిన టిపిటిఎల్ఏ సభ్యులు
జమ్మికుంట, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్): జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా, శనివారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా నుండి బస్ స్టాండ్ వరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రహమాన్ ఖాన్ మాట్లాడుతూ…అమాయక పౌరులపై జరిగిన ఈ దాడులు బాధాకరమని, సమాజానికి ఎంతో నష్టం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి దుఃఖంలో పాలుపంచుకుంటున్నామని చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దేశాభివృద్ధికి, మానవత్వానికి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఈ కష్ట సమయంలో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. అనంతరం జగన్ మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జమ్ము కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ దాడితో భారత దేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిందన్నారు. పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై పాశవికంగా దాడి చేశారు. తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతు ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రహమాన్ ఖాన్, ప్రధాన కార్యదర్శి పోలు రాజశేఖర్, ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సతీష్, రాజేందర్, కార్యవర్గ సభ్యులు ధనంజయ్, రాజేష్, రామాచారి, జగన్, రాజు, కిషన్, అంజిబాబు,చిలుముల శ్రీనివాస్, కోసిని శేఖర్, స్వర్ణలత, రజిత, రోషిని, నిర్మల, దొరబాబు, ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ పాల్గొన్నారు.