రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శిగా రామకృష్ణారావు

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం పదవిలో ఉన్న శాంతికుమారి ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం ఎంపిక చేసింది.
1989 బ్యాచ్కు చెందిన శాంతికుమారి 2021 జనవరి నుంచి సీఎస్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె పదవీ కాలం ముగియడంతో, 1990 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావుకు కొత్త బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆర్థిక శాఖను నిర్వహిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన రామకృష్ణారావు, ఈ రంగంలో తన అనుభవంతో రాష్ట్రానికి మరింత తోడ్పాటును అందిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ అధికారులలో శశాంక్ గోయల్ తరువాత రామకృష్ణారావు సీనియర్ అధికారి.
రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్గా, గుంటూరు కలెక్టర్గా సేవలు అందించారు. ఆయన ఈ ఏడాది ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. మే 1వ తేదీ నుండి రామకృష్ణారావు కొత్త సీఎస్గా విధులు చేపట్టనున్నారు.