గ్రామాల్లో దయనీయ
స్థితిపై ఆందోళన

- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు ఆరు డిమాండ్లతో మాజీ మంత్రి లేఖ
హైదరాబాద్, జూన్ 22 (విశ్వం న్యూస్): తెలంగాణ గ్రామాల్లో తలెత్తుతున్న సమస్యలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు మాజీ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు. కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు నిధులు రావడం ఆలస్యం అవుతుండటంతో తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయని లేఖలో హరీశ్ పేర్కొన్నారు.

గత ప్రభుత్వం హయాంలో గ్రామపంచాయతీల అభివృద్ధికి నిధులు సమయానికి ఇచ్చి, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాలను దేశానికి ఆదర్శంగా మార్చామన్నారు. అయితే ఇప్పుడు నిధుల రాహిత్యంతో పంచాయతీ కార్యదర్శులు తమ సొంత డబ్బులతో పనిచేస్తున్నారని, బిల్లులు పెండింగ్లో ఉండటంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకుందని చెప్పారు.
ఆరు ప్రధాన డిమాండ్లు ఇలా:
గ్రామ పంచాయతీలకు తక్షణమే నిధుల విడుదల.
మాజీ సర్పంచులు, కార్యదర్శులకు పెండింగ్ బిల్లుల క్లియరెన్స్.
ఔట్సోర్సింగ్ విధానంలో ఉన్న కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరణ.
వానాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహణ.
పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే వేతనాల చెల్లింపు.
ఇంటింటి కుటుంబ సర్వేకి పనిచేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జీతాల చెల్లింపు.
ఇవన్నీ తక్షణమే అమలులోకి తేవాలంటూ లేఖలో హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్ తర్వాత బిల్లుల చెల్లింపులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.