ప్రేమోన్మాదంలో తల్లిని పొట్టనపెట్టుకున్న కూతురు

- జీడిమెట్లలో హృదయాన్ని కలిచివేసిన ఘటన: ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన పదోతరగతి విద్యార్థిని
హైదరాబాద్, జూన్ 240 (విశ్వం న్యూస్): హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో మానవ సంబంధాలపై ప్రశ్నలు ఎత్తేలా చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. పదోతరగతి చదువుతున్న బాలిక తేజశ్రీ తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపేసిన విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఎన్ఎల్బీ నగర్లో నివాసముండే అంజలి అనే మహిళను ఆమె కుమార్తె హత్య చేయడం అందరినీ షాక్కు గురిచేసింది. నల్లగొండకు చెందిన డీజే ప్లేయర్ పగిల్ల శివ (19)తో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడిన తేజశ్రీ, గత ఎనిమిది నెలలుగా అతనితో ప్రేమ సంబంధం కొనసాగించడంతో తల్లికి అది నచ్చలేదు. ఈ వయస్సులో ప్రేమ తప్పు అని మందలించడంతో కోపంతో తేజశ్రీ తన ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్ (18)లతో కలిసి తల్లిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. హత్యకు పూర్తిగా స్కెచ్ వేసిన ముగ్గురు నిందితులు నిన్న సాయంత్రం అంజలి ఇంటికి వచ్చి, చున్నీతో ఉరివేసి తలపై బాదారు. అంజలిని కిరాతకంగా హత్య చేసిన అనంతరం, నిందితుడు శివ తన నడుముకు చున్నీ కట్టి పోలీస్ స్టేషన్కు వెళ్లడం సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.

అంజలి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలుగా, ఫోక్ సింగర్గా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందంలో పనిచేశారు. ఈ ఘటనతో కళాకారుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతూ, తేజశ్రీ ఐదు రోజుల క్రితమే ప్రియుడితో ఇంటినుంచి వెళ్లిపోయిందని, అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈ అమానుష చర్యపై జీడిమెట్ల పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. సమాజాన్ని చింతించనివ్వే ఈ ఘటనపై విస్తృత స్థాయిలో స్పందన వ్యక్తమవుతోంది.
- ప్రేమకు అడ్డుగా మారిందని ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో కలకలం రేపింది. ఇనుగుర్తి కి చెందిన సట్ల అంజలి మహబూబాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక సారథి బృంద సభ్యురాలిగా విధులు నిర్వహిస్తోంది. గత నెలలో ఆమె ఇక్కడ నుండి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు బదిలీపై వెళ్ళింది. పదేళ్ల క్రితం వరకు కూడా ఇనుగుర్తి లోనే నివాసముంటున్న అంజలి తల్లి ధనమ్మ కూడా కూతురు వద్దే ఉంటుంది. కరోనా సమయంలో ఒకసారి కుటుంబ సభ్యులంతా ఇనుగుర్తికి వచ్చి ఆ తర్వాత లాక్ డౌన్ అనంతరం తిరిగి హైదరాబాదులో ఉంటున్నారు. సొంత కూతురు చేతిలోనే అంజలి హత్యకు గురైన ఘటన తో ఇనుగుర్తి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోస్టుమార్టం అనంతరం అంజలి భౌతికకాయాన్ని మంగళవారం రాత్రి ఇనుగుర్తికి తీసుకువచ్చారు.
