
మేడారం, జనవరి 4 (విశ్వం న్యూస్) : తెలంగాణలో అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక ఉత్సవమైన మేడారం మహాజాతర సందర్భంగా నేడు భక్తుల జయఘోషతో మార్మోగుతున్నాయి. సమ్మక్క–సారలమ్మ తల్లుల దర్శనానికి భక్తులు మేడారం బాట పట్టారు. అడవుల మధ్య కొలువైన వనదేవతల దర్శనం కోసం భక్తులు భక్తిశ్రద్ధలతో బారులు తీరారు.
అమ్మవార్ల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం, రవాణా సదుపాయాలతో పాటు భద్రతాపరమైన చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు సీతక్క మేడారం మహాజాతర ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అడవిజాతి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని మంత్రులు స్పష్టం చేశారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం చేసుకుని తిరిగివెళ్లేలా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు.
తల్లుల కృప కోసం భక్తులు మేడారానికి తరలివస్తుండటంతో ఆధ్యాత్మిక వాతావరణం పరాకాష్టకు చేరింది. సమ్మక్క–సారలమ్మ నామస్మరణతో అడవులంతా పులకరించాయి.