దళిత ఎమ్మెల్యే ఇంటిపై దాడి
చేసిన వారిపై కేసులు పెట్టాలి

నాగారం, మార్చి 16 (విశ్వం న్యూస్): హైదరాబాద్ బోడుప్పల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటిపై కోడి గుడ్లతో దాడి చేసిన బీజేపీ, బీజేవైఎం నాయకులపై వెంటనే కేసులు నమోదు చేయాలని నాగారం మండలం ఈటూరు గ్రామ సర్పంచ్ వంగూరి దామోదర్ డిమాండ్ చేశారు.
దళిత ఎమ్మెల్యే అని చిన్న చూపుతో ఇంటిపై దాడికి ప్రేరేపించిన బీజేపీ నాయకుడు బండి సంజయ్తో పాటు సంబంధిత నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. జాతి చరిత్రను వివరించే క్రమంలో చేసిన వ్యాఖ్యలను రాజకీయంగా వక్రీకరించడం తగదని, అవి ఎవరినీ అవమానించాలనే ఉద్దేశంతో చేసినవి కావని తెలిపారు.
సమాజంలో దళితులపై జరుగుతున్న దాడులకు బీజేపీ, బీజేవైఎం నాయకులు నైతిక బాధ్యత వహించాలని ఆయన అన్నారు. దళితులపై దాడులు జరిగినప్పుడు స్పందించని వారు ఇప్పుడు చరిత్రకు సంబంధించిన వ్యాఖ్యలను రాజకీయంగా మలచి వివాదం సృష్టించడం సిగ్గుచేటని విమర్శించారు.