వెయ్యి జన్మలెత్తినా కేసీఆర్ చావడు” – కాంగ్రెస్పై కేసీఆర్ ఫైర్

జగిత్యాల: సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. తనపై “కేసీఆర్ చావాలి” అనే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను” అంటూ మండిపడ్డారు.

జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్, తెలంగాణ అభివృద్ధి కోసం గత పదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేసి భూగర్భ జలాలు పెంచామని, రైతులు కూడా ఉద్యమంలా ఇందులో పాల్గొన్నారని తెలిపారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించామని గుర్తు చేశారు. “నీళ్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నారా?” అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం నీటి సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు.
తనపై విమర్శలు చేసే వారిని ఉద్దేశించి కేసీఆర్ ఒక కథతో స్పందించారు. పిల్లి శాపం వల్ల ఉట్టి పడదని, అలాగే కొందరి మాటలతో తాను కూలిపోనని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎవ్వరూ తనను ఏమి చేయలేరని స్పష్టం చేశారు.
తన వయసు 72 ఏళ్లు అయినా, తెలంగాణ అభివృద్ధి పూర్తయ్యే వరకు సేవ చేస్తానని తెలిపారు. “చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేయాల్సిందే” అని అన్నారు.