
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విశ్వం న్యూస్) : ఉద్యోగులకు రావలసిన పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జాప్యం జరుగుతుండటంపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసి ఆరు నెలల క్రితం రిటైర్ అయిన విజయ్కుమార్కు ఇప్పటికీ రూ. 90 లక్షల బెనిఫిట్స్ అందకపోవడంపై దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
విజయ్కుమార్కు రావాల్సిన మొత్తం పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలను నాలుగు వారాల్లోగా పూర్తిగా చెల్లించాలని ఆదేశించింది. గడువు లోపల చెల్లింపులు జరగకపోతే, టోకెన్ జారీ తేదీ నుంచి 18 శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
వృద్ధాప్యంలో ఉద్యోగులు తమ కష్టార్జిత డబ్బుల కోసం కోర్టుల చుట్టూ తిరగడం అనుచితమని కోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.