ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత… డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విశ్వం న్యూస్) : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు ఉద్రిక్తంగా కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న ఈ సమ్మెలో గురువారం వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర కలకలం రేగింది. ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని తనపై తాను నిప్పంటించుకోవడం సంచలనంగా మారింది.
గత రెండు రోజులుగా సహచర కార్మికులతో కలిసి నిరసనల్లో పాల్గొన్న శంకర్ గౌడ్, అకస్మాత్తుగా ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నర్సంపేట బస్టాండ్ ఎదుట జరిగిన ఈ ఘటనతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వెంటనే స్పందించిన తోటి ఆర్టీసీ సిబ్బంది ఆయనను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో శంకర్ గౌడ్ తీవ్రంగా గాయపడగా, ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.
ఇక తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.