హరీశ్ రావు క్యాంపు ఆఫీసుపై దాడి.. సిద్దిపేటలో హై టెన్షన్

హైదరాబాద్, ఆగస్టు 17 (విశ్వం న్యూస్) : రుణమాఫీ విషయంపై మాజీ మంత్రి, సిద్దిపేట హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ముదిరిన వివాదం మరింత తారాస్థాయికి చేరింది. ఇప్పటికే హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు.. తాజాగా సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌పై దాడికి దిగారు. శుక్రవారం అర్ధరాత్రి హరీశ్ రావు క్యాంపు ఆఫీసులోకి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు.. క్యాంప్‌ గేట్లు బద్ధలు కొట్టి ఫ్లెక్సీలు చించేసి హంగామా సృష్టించారు. అంతేకాకుండా ఆఫీసుపైకి ఎక్కి హల్‌చల్ చేశారు. జై కాంగ్రెస్ అంటూ నినదాలు చేస్తూ.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినందుకు హరీశ్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని రెండు పార్టీల కార్యకర్తలను బయటకు పంపించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు.

ఈ ఘటనపై హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి.. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణం అని అన్నారు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి..? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం అని విమర్శించారు. వెంటనే ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *