
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విశ్వం న్యూస్):‘సమానత్వ దినోత్సవం’ సందర్భంగా దేశవ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ, తెలంగాణలో అంబేడ్కర్ విగ్రహం చుట్టూ నెలకొన్న పరిస్థితి వివాదాస్పదంగా మారింది. అణగారిన వర్గాలకు స్వేచ్ఛా హక్కులు సాధించిపెట్టిన మహనీయుడి స్ఫూర్తిని స్మరించాల్సిన రోజునే, ఆయన విగ్రహం ప్రజలకు పూర్తిగా అందుబాటులో లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తెలంగాణ నడిబొడ్డున ఉన్న అంబేడ్కర్ విగ్రహం చుట్టూ ఇనుప కంచెలు ఏర్పాటు చేయడం, ప్రవేశానికి పరిమితులు విధించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడైన మహనీయుడి స్మారకాన్ని ఇలా నిర్బంధించడం సరైంది కాదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాజకీయ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా దాసోజు శ్రవణ్ ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది ప్రజాస్వామ్యానికి అవమానమని విమర్శించారు. రాజకీయ కక్షలు, పరస్పర ఆరోపణల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక స్మారకాన్ని ప్రజలకు దూరం చేయడం అన్యాయం అని పేర్కొన్నారు. అంబేడ్కర్ విగ్రహం చుట్టూ ఉన్న ఆంక్షలను వెంటనే తొలగించి, ప్రజలకు స్వేచ్ఛగా దర్శనం కల్పించాలని, సమానత్వ దినోత్సవం రోజునైనా మహనీయుడికి విముక్తి కల్పించాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.