పార్టీ మారలేదూ…
అభివృద్ధికే భేటీ!

జగిత్యాల, ఫిబ్రవరి 4, 2026 (విశ్వం న్యూస్) : జగిత్యాల నియోజవర్గ అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి శాలువ కప్పుకున్నానని, అంతమాత్రాన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కాదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ స్పష్టంగా తేల్చిచెప్పారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదని ఆయన అన్నారు.
తాను ఎక్కడా పార్టీ మారుతున్నట్టు ప్రకటించలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి నెలకు రూ.5 వేల సభ్యత్వ ఫీజు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నానని, పార్టీలోనే కొనసాగుతున్నానని అఫిడవిట్ రూపంలో అధికారికంగా సమర్పించిన విషయాన్ని వెల్లడించారు.
అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వంతో మాట్లాడటం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతేనని, దాన్ని రాజకీయ రంగు పులుముతూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని సంజయ్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు సరదాగా స్పందిస్తూ—“కనీసం పక్కన ఉన్నోళ్ల కండువాలు కాసేపు తీసేసుంటే ఇంత గందరగోళం వచ్చేది కాదేమో” అంటూ వ్యాఖ్యానించారు.