ఎన్నికలు ప్రశాంతంగా
జరగాలి: ఎస్పీ నరసింహ

నాగారం, నవంబర్ 29 (విశ్వం న్యూస్) : స్థానిక ఎన్నికలను సంపూర్ణ శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని విధాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం నాగారం మండల పరిధిలోని వర్ధమానుకోటలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమల్లో ఉందని, అందువల్ల ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు శాంతిని భంగం చేసే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఎస్పీతో పాటు డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ నాగేశ్వరరావు, ఎస్సై చిరంజీవి తదితర అధికారులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.