గోవా కర్రలు కూలి
నలుగురు మృతి

హైదరాబాద్, మార్చి 5 (విశ్వం న్యూస్): హైదరాబాద్ నగరంలోని టోలీచౌకీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అల్ హస్నాత్ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనానికి ఏర్పాటు చేసిన గోవా కర్రలు ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడి నలుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో మృతి చెందిన వారిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుపతి రావు, నారాయణగా గుర్తించారు. గాయపడిన వారిలో శ్రీకాకుళానికి చెందిన ఆర్. రమేష్, ఒడిశాకు చెందిన ఎం. రమేష్, బండ్లగుడాకు చెందిన లాల్ అహ్మద్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని పోలీసులు లంగర్ హౌస్లోని ఆలివ్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

భవనం పక్కనే ఉన్న ఆటోపై కూడా గోవా కర్రలు పడటంతో అందులో ఉన్నవారు గాయపడినట్లు సమాచారం. కార్మికులు గోవా కర్రలపై నిలబడి పనులు చేస్తుండగా ఒక్కసారిగా కర్రలు కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు భవన యజమానికి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
