మంత్రులు గంగుల, శ్రీనివాస్గౌడ్
ఎన్నిక చెల్లవంటూ పిటిషన్లు

- హైకోర్టు కీలక ఆదేశాలు జారీ
హైదరాబాద్, జూలై 31 (విశ్వం న్యూస్) : కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లందంటూ తెలంగాణాలో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా, ఇవాళ(జులై 31 సోమవారం)దానిపై విచారణ జరిగింది.. ఎన్నికల అఫిడవిట్ లో గంగుల కమలాకర్ తప్పుడు వివరాలు ఇచ్చారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2018 ఎన్నికల సమయంలో బండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గంగుల చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.
అయితే.. గంగుల తప్పుడు వివరాలతో అఫిడవిట్ సమర్పించారంటూ బండి సంజయ్ పిటిషన్ వేశారు. ఈ తరుణంలో ఇవాళ విచారణ జరగ్గా.. పిటిషనర్ను క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి శైలజతో కమిషన్ ఏర్పాటు చేసిన హైకోర్టు.. ఆగస్టు 12 నుండి 17 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అగస్ట్ 21కి వాయిదా వేసింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్పై దాఖలైన అనర్హత పిటిషన్పైనా నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిగింది. ఎన్నికల అఫిడవిట్లో శ్రీనివాస్గౌడ్ తప్పుడు ధ్రుృవపత్రాలు సమర్పించారని… ఆయన ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదంటూ మహబూబ్నగర్కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. రాఘవేంద్ర రాజు పిటిషన్పై విచారిచిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్ ట్యాంపరింగ్కు పాల్పడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మంత్రితో పాటు నలుగురు ఐఏఎస్ అధికారులపైన కూడా కేసులు పెట్టాలని సూచించింది. ఎన్నికల కమిషన్కు సంబంధించి స్టేట్, సెంట్రల్ అధికారులపైన, రిటర్నింగ్ అధికారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని సూచించింది. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓ మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు కానుండటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.
మరోవైపు… ఈ పిటిషన్ను కొట్టేయాలంటూ మంత్రి శ్రీనివాస్గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా చుక్కెదురైంది. ఈ పిటిషన్ మీద విచారణ చేసిన ధర్మాసనం.. ఎన్నికల అఫిడవిట్ ఆధారంగానే విచారణ చేసింది. అఫిడవిట్, ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ను ధర్మాసనం ఆదేశించింది. కోర్టు విచారణపై మీడియాకు ఎలాంటి సమాచారం షేర్ చేసుకోవద్దని ఆదేశించింది.