
హైదరాబాద్, మార్చి 29 (విశ్వం న్యూస్) : కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు మరో ‘పేమెంట్’ షాక్ ఇచ్చింది. డిజిటల్ చెల్లింపులను బాగా ప్రోత్సహించిన కేంద్రం ఇప్పుడు అదును చూసి మోతమోగించింది. ఇప్పుడు డిజిటల్ చెల్లింపులపై అదనపు ఛార్జీల మోపాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పీ.సీఐ) చేసిన సిఫారసులను యధాతథంగా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ 1వ తేదీన ఆరంభం అయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇప్పుడు అందరూ పేమంట్స్ యూపీఐ ద్వారానే చేస్తున్నారు.
ఫోన్ పే, గూగుల్ పే, అమేజాన్ పే, పేటీఎంల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. యూనిఫైడ్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ని ద్వారా ఆర్థిక వ్యాపారి లావాదేవీలపై అదనపు ఛార్జీలను వసూలు చేయాలంటూ ఎన్సీపీఐ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఓ సర్య్యూలర్ ను జారీ చేసిందా సంస్థ. దేశవ్యాప్తంగా యూపీఐ (యూపీఐ) ద్వారా వినియోగదారులు జరిపే బ్యాకింగ్ నాన్ బ్యాంకింగ్ ఆర్థిక లావాదేవీలు నగదు బదిలీలు నగదు చెల్లింపులన్నింటిపైనా ఈ అదనపు ఛార్జీలను వసూలు చేయాలని సూచించింది.
ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్స్ లావాదేవీలపై ఛార్జీలు వేయనున్నారు. ఈ తరహా ఆర్థిక లావాదేవీలు నగదు బదిలీలు చెల్లింపులపై ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రూమెంట్ (పీపీఐ) ఛార్జీలను వసూలు చేయాలని సిఫారసు చేసింది. దీన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని సూచించింది. దీనికి కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్సీపీఐ చేసిన సిఫారసులను యధాతథంగా అమలు చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.
ఎన్సీపీఐ జారీ చేసిన సర్య్కూలర్ ప్రకారం.. యూపీఐ (యూపీఐ) ద్వారా 2వేల రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు చేసిన వినియోగదారులపై 1.1 శాతం అదనపు ఛార్జీలను ఎన్సీపీఐ వసూలు చేస్తుంది. అదనపు ఛార్జీలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రూ మెంట్ ను జారీ చేసేవారు రెమిటర్ బ్యాంక్ కు వాలెట్ లోడింగ్ సర్వీస్ ఛార్జ్ గా సుమారు 15 బేసిస్ పాయింట్లను చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఖాతా పీపీఐ వాలెట్ మధ్య పీర్ టు పీర్ (పీ2పీ) లేదా పీర్ టు పీర్ మర్చంట్ లావాదేవీల పరంగా ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇలా యూపీఐ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని కేంద్రప్రభుత్వం ఇతర రంగాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తుంది. ఇందులో ఇంధనం 0.5శాతం టెలికం యుటిలిటీస్/పోస్టాపీస్ విద్య వ్యవసాయానికి 0.9 శాతం మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ రైల్వేలకు ఒక శాతాన్ని బదలాయిస్తుంది.
ఈ అదనపు ఛార్జీల వసూలుపై సెప్టెంబరు 30వ తేదీన ఎన్సీపీఐ సమీక్ష నిర్వహిస్తుంది. దీన్ని మున్ముందు అమలు చేయాలా? వద్దా? లేక అదనపు ఛార్జీలను మరింత పెంచాలా? లేక తగ్గించాలా? అదనపు ఛార్జీల పరిధి మొత్తం.. వంటి అంశాలను సమీక్షిస్తుంది. ఎన్సీపీఐ ద్వారా ఈ ఏడాది జనవరిలో 12.98 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు నమోదయ్యాయి.