ఫాతిమా నగర్ లో..ఉత్సవ శోభ…

- జాతరకు పోటెత్తిన భక్తులు
- ప్రత్యేక పూజలు చేసిన
వరంగల్ బిషప్ ఉడుముల బాల - కన్నుల పండువగా
ఫాతిమా మాత ప్రతిమ ఊరేగింపు
కాజీపేట, మార్చి 12 (విశ్వం న్యూస్): కాజీపేట పట్టణ పరిధిలోని ఫాతిమా నగర్ లో ఉత్సవ శోభ నెలకొంది. ఈనెల 11వ తేదీన ప్రారంభమైన ఫాతిమా మాత ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉత్సవాల రెండవ రోజైన బుధవారం వరంగల్ బిషప్ ఉడుముల బాల దివ్యబలి పూజను సమర్పించారు. ఆ చర్చి విచారణ గురువు మర్రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు కొనసాగాయి. సాయంత్రం ఫాతిమా మాత ప్రతిమను ఒక ప్రత్యేక వాహనం పైన ఏర్పాటు చేసి వరంగల్ బిషప్ ఉడుముల బాల ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఫాతిమా నగర్ పురవీధుల్లో ప్రదక్షిణ చేశారు. ఈ ఫాతిమా మాత రథ ప్రదక్షిణను వేలాదిమంది భక్తులు అనుసరించారు.

ఫాతిమా నగర్ లోని పురవీధుల్లోకి వచ్చిన ఫాతిమా మాత కు భక్తులు ఘన స్వాగతం పలికారు. ఫాతిమా మాత ప్రతిమను తిలకిస్తూ తన్మయత్వానికి గురైనారు. ఫాదర్లు, భక్తులు తరలిరావడంతో ఫాతిమా నగర్ లో పండుగ వాతావరణం కనిపించింది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో సిఐ సుధాకర్ రెడ్డి, కార్పొరేటర్ లు అబూబకర్, మానస, చర్చి కమిటీ అధ్యక్షుడు దయాసాగర్, పలువురు ఫాదర్లు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వార్త…శ్యామ్🖋️