లబ్ధిదారుల ఖాతాల్లోకి
డబ్బులు, గైడ్లైన్స్ ఇవే..

- పేదల స్వగృహ కలను సాకారం చేసే ‘ఇందిరమ్మ ఇండ్లు’
- లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు, మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్, జూన్ 8 (విశ్వం న్యూస్) : పేదల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వం మరోసారి తమ నిబద్ధతను చాటింది. పేద ప్రజలకు సొంత గృహం కలగాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో తాజాగా కీలక మలుపు వచ్చింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమచేసే ప్రక్రియకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. గృహ నిర్మాణం ప్రారంభం నుంచి నిధుల విడుదల వరకు ప్రతి దశలో పారదర్శకత కాపాడేందుకు అధికారులు ప్రత్యేక పథకాన్ని రూపొందించారు.
జీవో 259తో మార్గదర్శకాలు
హౌసింగ్ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్ శనివారం జీవో నెంబర్ 259 విడుదల చేశారు. ఇందులో పథకం అమలులో భాగస్వాములైన అన్ని స్థాయిల అధికారుల బాధ్యతలు, నిధుల విడుదల తీరు, ఫీల్డ్ తనిఖీలు, డేటా ధృవీకరణ వంటి అంశాలపై సమగ్ర దృష్టి సారించారు. ముఖ్యంగా పథకం పారదర్శకతపై ప్రత్యేక దృష్టితో విజిలెన్స్ మెకానిజం రూపొందించారు.
ఇంటికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం
ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రూ. 5 లక్షల నిధులు నాలుగు విడతల్లో జమ చేయనున్నారు. ఈ మొత్తం వారికి సొంత స్థలంలో గృహ నిర్మాణం కోసం మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. నిధుల విడుదలను ఆధార్ ఆధారిత బ్యాంక్ ఖాతాల ద్వారా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జరిపేందుకు చర్యలు చేపట్టారు.
వారానికి ఒకసారి నిధుల విడుదల
ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక మొదటి విడతలో పూర్తైంది. పలువురు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను ప్రారంభించారు. మరికొందరిని నిర్మాణ ప్రారంభానికి ప్రోత్సహించేందుకు పంచాయతీ అధికారులు స్వయంగా ముందుకొస్తున్నారు.

బాధ్యతలు, అధికారుల డ్యూటీలు స్పష్టంగా
ఈ పథకం అమలులో పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ వార్డు అధికారులు, హౌసింగ్ ఇంజినీర్లు, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, కలెక్టర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన బాధ్యతలు కేటాయించారు:
పంచాయతీ సెక్రటరీలు, వార్డు అధికారులు – గృహ నిర్మాణ తనిఖీలు, ఆధార్-బ్యాంక్ ఖాతా ధృవీకరణ, అర్హుల శ్రేణీకరణ. AE, DE, EE లు – ఇంటి నిర్మాణం నాలుగు దశల్లో పరిశీలన చేయాలి, నివేదికలు తయారు చేయాలి. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు (PD) – నివేదికలను కలెక్టర్, హౌసింగ్ ఎండీకి సమర్పణ. విజిలెన్స్ అధికారులుగా – మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు వ్యవహరిస్తారు.
పారదర్శకత కోసం ఐటీ ఆధారిత మానిటరింగ్
ప్రతి దశలోనూ డేటా మానిటరింగ్ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగించనున్నారు. నిర్మాణం పురోగతిని జియో ట్యాగింగ్, ఫోటోలు, నివేదికల రూపంలో అప్లోడ్ చేయాలి. అర్హతల ప్రకారం నిధుల విడుదలకు ఆధునిక టెక్నాలజీ ఆధారిత వ్యవస్థ అమలు చేయనున్నారు.
లబ్ధిదారులకు సూచనలు
ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణం చేయడం, క్రమపద్ధతుల్లో ఖర్చులను చూపించడం, డేటా అప్డేట్స్ ఇవ్వడం లబ్ధిదారుల బాధ్యత. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ, తమ ఇంటి కలను సాకారం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.