జనగామ:సేవల్లో ఆర్యవైశ్యులు
ముందున్నారు:మంత్రి ఎర్రబెల్లి

- ఆర్య వైశ్య నిరుపేదలకు కుట్టు మిషన్ల పంపిణీ
- ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జనగామ జిల్లా శాఖ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ, ఆగస్టు 27 (విశ్వం న్యూస్) : ఆర్యవైశ్యులు సంపాదనలోనే గాక, సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నారని, మరింత సేవ చేసి, నిరుపేదలుగా ఉన్న ఆర్యవైశ్యులతోపాటు, సమాజంలోని ఇతర పేదలనుకూడా ఆదుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తిచేశారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జనగామ జిల్లా శాఖ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వ్యాపారాలకే పరిమితమైన ఆర్యవైశ్యులు ఇవ్వాళ సామాజిక సేవా, రాజకీయ రంగాల్లోనూ రాణిస్తున్నారని మంత్రి అన్నారు. చదువుల్లోనూ ముందున్నారన్నారు.
తనకు ఆర్యవైశ్యులతో ఎన్నో ఏండ్లుగా అనుబంధం ఉందన్నారు. ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాలతో అందరినీ ఆదుకోవాలన్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని మంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్గుప్త, బిజ్జాల నవీన్, ఉపేందర్, రాపాక విజయ్, ఆర్యవైశ్య ప్రముఖులు, నూతన కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల కార్యవర్గాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.