అదానీ ఆర్థిక నేరాలపై జేపీసీ వేయాలి

- మోడీ అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ మూడో రోజు పార్లమెంటును బహిష్కరించిన బీఆర్ఎస్, కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎండీఎంకే
- గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష ఎంపీలతో కలిసి ఆందోళనకు దిగిన రవిచంద్ర

హైదరాబాద్, మార్చి 15 (విశ్వం న్యూస్) : అదానీ ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణగాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) నియమించాలంటూ ప్రతిపక్షాలు మూడో రోజు కూడా పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాయి. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన అదానీని కేంద్ర ప్రభుత్వం వెనుకేసుకు రావడాన్ని, జేపీసీ వేయకుండా మొండి వైఖరి అవలంభించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ ఎండీఎంకే తదితర పక్షాల ఎంపీలు ఉభయ సభల సమావేశాలను బహిష్కరించి పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎంపీలు సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, పీ.రాములు, కే.ఆర్.సురేష్ రెడ్డి, బీ.బీ.పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, కవిత, బోర్లకుంట వెంకటేష్ నేతకాని, మన్నె శ్రీనివాస్ రెడ్డి, జైరాం రమేష్ (కాంగ్రెస్), వై.గోపాలస్వామి(ఎండీఎంకే) తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు “అదానీ వ్యవహారంపై సమగ్ర విచారణకు జేపీసీని నియమించాలని, సీబీఐ,ఈడీలను దుర్వినియోగం చేయడాన్ని వెంటనే ఆపేయాలి, కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడాలని, ‘మోడీ నిరంకుశ, నియంతృత్వ విధానాలను విడనాడాలంటూ’ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
