కర్ణాటక:నేనేం బచ్చాగాడ్ని కాదు:డీకే శివకుమార్‌

కర్ణాటక:నేనేం బచ్చాగాడ్ని
కాదు:డీకే శివకుమార్‌

  • నేనేం తిరుగుబాటు చేయను. అలాగే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడను

కర్ణాటక, మే 16 (విశ్వం న్యూస్) : కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం విషయంలో పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌(61) పార్టీ హైకమాండ్‌కు మరోసారి గట్టి సంకేతాలు పంపించారు. ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని చెబుతున్న ఆయన.. అవసరమైతే నిరసన తెలుపుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సిద్ధరామయ్యకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు.

తన నివాసంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన.. కాసేపటికే మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లో నాకంటూ ఓ వర్గం లేదు. ఎమ్మెల్యేలంతా నా వాళ్లే. ఒంటరిగా కాంగ్రెస్‌కు 135 సీట్లు తెచ్చిపెట్టా. పైగా కాంగ్రెస్‌ చీఫ్‌(మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి..) నావైపే ఉన్నారు. నా బలాన్ని ఎవరూ లాక్కోలేరు. అలాగే.. వేరే వాళ్ల బలంపై నేను మాట్లాడను. అవసరమైతే నిరసన తెలుపుతా అంటూ పేర్కొన్నారాయన.

ఇక ఢిల్లీకి తాను వెళ్లబోవట్లేదని తేల్చి చెప్పిన శివకుమార్‌.. పనిలో పనిగా చివరిలో సిద్ధరామయ్యకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ కామెంట్‌ చేశారు. అంతేకాదు.. తిరుగుబాటు చేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నేనేం తిరుగుబాటు చేయను. అలాగే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడను. నేనేం బచ్చాగాడ్ని కాదు. నాకంటూ ఓ విజన్‌ నాకుంది. అలాగే పార్టీ పట్ల విధేయత కూడా ఉంది. ముందు పార్టీ అధిష్టానాన్ని నిర్ణయం తీసుకోనివ్వండి అని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన.

ఇదిలా ఉంటే.. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందంటూ హస్తిన పర్యటనకు వెళ్లిన సిద్ధరామయ్య(75), ఇవాళ రాత్రి పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీతో భేటీ అవుతారనే ప్రచారం నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *