జనవరి 11 సింహగర్జనను విజయవంతం చేయండి: ఓసీ జేఏసీ

వరంగల్, డిసెంబర్ 24 (విశ్వం న్యూస్) : ఓసీలకు జాతీయ స్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గోపు జయపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓసీలపై మొదటి నుంచీ అన్ని రంగాల్లో జరుగుతున్న వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా జనవరి 11న వరంగల్లో నిర్వహించనున్న ‘ఓసీ సింహగర్జన’ను విజయవంతం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఓసీ బిడ్డ ఒక సైనికుడిలా పని చేసి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరారు.

బుధవారం హన్మకొండ బాలసముద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఓసీ జేఏసీ కార్యాలయాన్ని సీనియర్ జర్నలిస్ట్ తుమ్మ శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు దుబ్బ శ్రీనివాస్, రాయపాటి వెంకటేశ్వరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు గోపు జయపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ— రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి తదితర రిజర్వేషన్ పొందని సామాజిక వర్గాల దీర్ఘకాల పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం అగ్రకులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమలులో ఆలస్యం చేయడంతో పాటు రిజర్వేషన్లపై కావాలనే దుష్ప్రచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఓసీలంతా ఐక్యంగా న్యాయమైన హక్కుల కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని, పోరాటాల గడ్డ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో జనవరి 11న లక్ష మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం జేఏసీ నాయకులు పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాము నడివిల్లి, వెంకటేశ్వరావు, అర్జుల కిషన్ రెడ్డి, చందుపట్ల నర్సింహ రెడ్డి, దొడ్డ మోహన్ రావు, వీరారెడ్డి సంజీవ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు కృష్ణ మోహన్, పెద్దిష్ బుచ్చిరెడ్డి, జేఏసీ నాయకులు తోట సురేష్, జగన్ మోహన్ శర్మ, బ్రాహ్మణ సంఘ నాయకురాలు వాణి తదితరులు పాల్గొన్నారు.