ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్​ అంత్యక్రియలు

హైదరాబాద్, డిసెంబర్ 28 (విశ్వం న్యూస్) : భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరి మజిలీ ముగిసింది. దిల్లీలోని నిగమ్ బోథ్ ఘాట్ లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. కేంద్రప్రభుత్వ అధికారలాంఛనాలతో మన్మోహన్ పార్థివదేహానికి అధికారులు అంత్యక్రియలను పూర్తిచేశారు. అంతిమ సంస్కారాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్​దీప్ ధన్ ఖడ్ , ప్రధాని నరేంద్ర మోదీ, భూటాన్ రాజు, లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా సహా ఇతర కేంద్రమంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్​తో పాటు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

వారంతా వరుసగా మన్మోహన్ పార్థివదేహానికి సైనిక లాంఛనాల నడుమ పుష్పగుచ్ఛాలు సమర్పించారు. అనంతరం మన్మోహన్ పార్థివదేహానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుష్పగుచ్ఛం సమర్పించి సెల్యూట్ చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో పాటు త్రివిధ దళాధిపతులు మన్మోహన్ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. తర్వాత గౌరవ వందనం చేసిన త్రివిధదళాల అధికారులు పేటికపై ఉన్న పూలు, జాతీయ జెండాను తొలగించారు.

మన్మోహన్ బంధువులు, మతపెద్దలతో పాటు రాహుల్ గాంధీ పాడే మోస్తూ నిగమ్ బోధ్ ఘాట్ లో చితి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సిక్కు మత సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించిన అనంతరం చితిని పేర్చి పార్థివదేహాన్ని దహనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *