మంత్రి పొంగులేటి
అధికార దుర్వినియోగం


- మంత్రి పై భూవివాద ఆరోపణలు: కోర్టు ఆదేశాల అమలు లేకపోవడంపై ఆందోళన
హైదరాబాద్, ఏప్రిల్ 9 (విశ్వం న్యూస్) : ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై భూవివాదం, అధికార దుర్వినియోగం అంశాలపై ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రంగారెడ్డి జిల్లాలో సుమారు 27 ఎకరాల భూమి సంబంధిత వివాదంపై బాధితులు సతీష్ షా కుటుంబం తమ సమస్యలను వెల్లడించినట్లు తెలిపారు. గతంలో పలు సర్వేలు జరిగి ఎటువంటి వివాదం లేకపోయినా, ఇటీవల అభివృద్ధి ఒప్పందాల తర్వాత సమస్యలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.
అక్రమ సర్వేలు నిర్వహించబడినట్లు ఆరోపిస్తూ, ఆ సర్వేలను హైకోర్టు రద్దు చేసినప్పటికీ, అనంతరం స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కాంపౌండ్ గోడ కూల్చివేత, ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారని తెలిపారు.

పోలీసుల వ్యవహారంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. కోర్టు ఆదేశాల అమలు విషయంలో లోపాలు ఉన్నాయని విమర్శించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని, బాధితులకు రక్షణ కల్పించాలని, వివాదంపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబం కూడా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.