
కోల్ కోతా, జనవరి 20 (విశ్వం న్యూస్) : దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధించింది పశ్చిమ బెంగాల్ లోని సిల్దా కోర్టు. జీవిత ఖైదు విధించడంతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ నేడు తీర్పు వెల్లడించింది. మరణించేంతవరకూ సంజయ్ జైలులోనే ఉండాలని తన తీర్పు స్పష్టంగా పేర్కొంది. అలాగే భాదితురాలు కుటుంబానికి రూ.17 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలంటూ న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు.. ఈ కేసులో కోర్టు మొత్తం 120 మంది సాక్షులను విచారించింది.. 162 రోజులలోనే మొత్తం విచారణను పూర్తి చేసి తీర్పు ఇవ్వడం విశేషం.
ఈ కేసులో దోషికి జీవిత ఖైదు విధించడం పట్ల బాధిత కుటుంబీకులు ఆగ్రహం వక్తం చేశారు.. తమకు ఎటువంటి నష్ట పరిహారం అవసరం లేదని, దోషికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నామని కోర్టులోనే నినాదాలు చేశారు.. తమకు కింద కోర్టులో న్యాయం జరగలేదని, పై కోర్టుకు వెళతామని పేర్కొన్నారు..