సీబీఐ కొత్త డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్

సీబీఐ కొత్త డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్

కర్ణాటక డీజీపీకి కేంద్రం కీలక బాధ్యతలు
హైదరాబాద్, మే 14 (విశ్వం న్యూస్) : కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐకి కొత్త డైరెక్టర్​ను నియమించింది కేంద్రం. ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్​కు సీబీఐ నూతన డైరెక్టర్​గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారని వెల్లడించింది. ప్రస్తుత డైరెక్టర్​ సుబోధ్ కుమార్ జయస్​వాల్ స్థానంలో ఆయనను ఎంపిక చేసినట్లు కేంద్రం వివరించింది. మే 25న జయస్​వాల్ పదవీ కాలం ముగుస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

సీబీఐ డెరెక్టర్​ను ఎంపిక చేసే ప్యానల్​.. ప్రవీణ్ సూద్​ నియామకానికి ఆదివారం ఆమోదం తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్యానల్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్​, లోక్​సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్నారు. శనివారం జరిగిన ఈ ప్యానల్​ సమావేశంలో సూద్‌ ఎంపికపై.. కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అసమ్మతి నోట్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు.

సీబీఐ కొత్త డైరెక్టర్​ ప్రవీణ్ సూద్​.. 1986 ఐపీఎస్​ బ్యాచ్​కు చెందిన అధికారి. గత మూడు సంవత్సరాలుగా ఆయన కర్ణాటక డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రవీణ్ సూద్​ దిల్లీ ఐఐటీలో, ఐఐఏమ్​ బెంగళూరులో చదువుకున్నారు. న్యూయార్క్‌లోని సిరక్యూస్ విశ్వవిద్యాలయంలోనూ విద్యాభ్యాసం చేశారు.
ప్రవీణ్​ సూద్​ కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్​ జిల్లాలకు సూపరింటెండెంట్​గా పనిచేశారు. బెంగళూరు నగరానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్)గాను సేవలు అందించారు. అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్), మైసూర్ సిటీ పోలీసు కమిషనర్​గా బాధ్యతలు నిర్వర్తించారు. మారిషస్ ప్రభుత్వానికి పోలీసు సలహాదారుగాను ప్రవీణ్​ సూద్​ పనిచేశారు. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణకు సాంకేతికతను ఉపయోగించడం, పౌరులకు సమర్థమైన సేవలను అందించడం వంటి కార్యక్రమాలతో.. ప్రవీణ్​ సూద్​కు 2011లో నేషనల్ ఈ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డు వరించింది. 2006లో ప్రిన్స్ మైఖేల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు సైతం ఆయన అందుకున్నారు.

ఇటీవలే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ ప్రవీణ్‌ సూద్‌పై కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్నారంటూ బహిరంగంగా ఆరోపించారు. డీజీపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని కూడా కొన్నివారాలు క్రితం పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక డీజీపీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన మరుసటి రోజే సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌ ఎంపిక కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *