కూకట్పల్లిలో వ్యభిచార
ముఠా గుట్టురట్టు:విటుల అరెస్టు

హైదరాబాద్, మార్చి 7 (విశ్వం న్యూస్) : నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేశారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) పోలీసులు పక్కా సమాచారంతో సుమిత్రనగర్లోని వేర్వేరు అపార్ట్మెంట్లలో శనివారం రెయిడ్ నిర్వహించారు.
పోలీసుల వివరాల ప్రకారం, కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని సుమిత్రనగర్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలు నడుస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దాడి చేపట్టారు. ఈ దాడుల్లో ఇద్దరు నిర్వాహకులతో పాటు పలువురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఒక అపార్ట్మెంట్లో నిర్వహించిన దాడిలో నిర్వాహకురాలు (40), విటుడు రవికుమార్ (47), మరో మహిళ (47)ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళను రెస్క్యూ హోంకు తరలించి, నిర్వాహకురాలు మరియు రవికుమార్లను రిమాండ్కు పంపారు. అదే కాలనీలోని మరో అపార్ట్మెంట్పై చేసిన దాడిలో నిర్వాహకురాలు (46), విటుడు శ్రీవేంద్ర వర్మ (30)లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో మహిళను (32) ప్రభుత్వ హోంకు తరలించారు.
ఇంకా ఈ ముఠా సోషల్ మీడియా వేదికల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కస్టమర్ల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి, బాధిత మహిళలకు మాత్రం తక్కువ మొత్తమే ఇస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.