ప్రజా అర్జీలను వెంటనే పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి, జనవరి 23 (విశ్వం న్యూస్) : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ లు వి.లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్ లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి అర్జీలను ప్రజావాణి వెబ్ పోర్టల్ నందు నమోదు చేయడం జరుగుతుందని, జిల్లా అధికారులు తమ శాఖకు వచ్చిన అర్జీలను మరొకమారు పరిశీలన చేసి అర్జీలను పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని, అలాగే వెబ్ పోర్టల్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. ఈ రోజు మొత్తం (83) దరఖాస్తులు రాగా, రెవెన్యూ సంబంధించినవి (62), ఇతర శాఖలకు చెందినవి (21) దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఏ.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.