మెగా కుటుంబంలో
డబుల్ సెలబ్రేషన్

హైదరాబాద్, జనవరి 31, 2026 (విశ్వం న్యూస్) : మెగా ఫ్యామిలీలో సందడి మొదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. శనివారం రాత్రి ఉపాసన పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఒక బాబు, ఒక పాప పుట్టగా తల్లి, పిల్లలు అందరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఈ శుభవార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఆసుపత్రిలో ఉండగా, అభిమానులు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఆసుపత్రి పరిసరాలు అభిమానుల హర్షధ్వానాలతో మార్మోగుతున్నాయి.

కవలలు పుట్టిన విషయాన్ని చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించడంతో సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆసుపత్రి వద్దే సంబురాలు చేసుకుంటూ స్వీట్లు పంచిపెడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.