మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్: ఎం.ఏ సమద్

విశ్వం న్యూస్ / తిమ్మాపూర్, మార్చి 21: ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ మత సామరస్యానికి, లౌకికవాదానికి ప్రతీక అని తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు ఎం.ఏ సమద్ అన్నారు.
శనివారం ఈద్–ఉల్–ఫితర్ సందర్భంగా తిమ్మాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ముస్లింలు భక్తిశ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా నగర్, ఎల్ఎండి ప్రాంతాల్లోని దర్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ఎం.ఏ సమద్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, అలయ్ బలయ్ చేసుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యంతోనే హిందూ–ముస్లింల మధ్య శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమాభిమానాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. రంజాన్ పండుగ ఈ విలువలను సమాజంలో బలపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు.
రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు క్రమశిక్షణతో చేసే ప్రార్థనలు, దానధర్మాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. అల్లాహ్ కరుణాకటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.