మత్స్యకారుల సంక్షేమానికి
ప్రత్యేక దృష్టి:మంత్రి గంగుల

- నీలి విప్లవంతో చేపలను దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం.
- కాలేశ్వరం జలాలతో చెరువులు నిండుకుండలా మారాయి.
- 2014-15 నుండి 2022-23 వరకు వంద శాతం రాయితీపై 1234.48 లక్షల చేప పిల్లలను 155.87 లక్షల రొయ్య పిల్లలను చెరువులలో, కుంటలలో విడుదల చేశాం.
- మండుటెండల్లో మత్తడులు దూకుతున్న చెరువులు.
- రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.
కరీంనగర్ బ్యూరో, జూన్ 8 (విశ్వం న్యూస్) : మత్స్యరంగం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా గురువారం నాడు జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్ లో జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నుండి 3రోజులపాటు నిర్వహించనున్న ఫిష్ ఫుడ్ ఫెస్టీవల్ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించి ఫుడ్ ఫెస్టివల్ లో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఏర్పాటుచేసిన వివిధ రకాల చేప వంటకాలు, వాటి ద్వారా లభించే పోషకాలు, వాటి పెరుగుదల తదితర విషయాల గురించి మత్స్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీత తీయడం, నీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల వ్యవసాయ రంగం తోపాటు మత్స్య రంగం మంచి ప్రగతిని సాధించిందని అన్నారు.

మత్స్యకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నీటి వనరులలో ఉచితంగా చేప, రొయ్య పిల్లలను వేస్తుందని 2014-15 నుండి 2022-23 వరకు జిల్లాలో 100% రాయితీపై1234.48 లక్షల చేప పిల్లలు రూపాయలు 1045.13 లక్షలు ఖర్చు చేసిందని అలాగే 155.87 లక్షల రొయ్య పిల్లలను రూపాయలు 343 లక్షలు ఖర్చు చేసిందని తెలిపారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 4189 యూనిట్లకు రూపాయలు 2386.07 లక్షలు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జిల్లా లోని అన్ని చెరువుల, కుంటలలో నీరు నింపడం వల్ల జలకల ఉట్టిపడుతున్నదని ఇందులో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మంత్రి అన్నారు. మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, నగర మేయర్ వై. సునీల్ రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి దేవేందర్, ముఖ్య ప్రణాళిక అధికారి కొమురయ్య, మత్స్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.