అటు బడి’బాట’.. ఇటు సర్దు’బాట’నా..!?

- విద్యార్థుల సంఖ్య పెరిగితే ఎలా..?
- సర్దుబాటు గడువును పొడిగించాలి
- పెరుమాండ్ల సాంబమూర్తి
- (బిసిటియు వరంగల్ జిల్లా అధ్యక్షుడు)
కాజీపేట, మే 31 (విశ్వం న్యూస్):నానాటికి విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది అని పేర్కొంటూ వేసవి సెలవుల్లో కెపాసిటీ బిల్డింగ్ పేరుతో టీచర్లకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం.. ఆ శిక్షణ లక్ష్యాలను దెబ్బతీసే విధంగా జారీ చేసిన టీచర్ల సర్దుబాటు గడువును పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిసి టీచర్స్ యూనియన్ (బిసిటి యు) వరంగల్ జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి అన్నారు. కాజీపేట ఫాతిమా నగర్ లో శనివారం ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
ఒకవైపు విద్యార్థుల సంఖ్యను పెంచమంటూ.. మరోవైపు టీచర్ల సర్దుబాటు జూన్ 12వ తేదీ పాఠశాలలు తెరిచేలోపే పూర్తి చేయాలని ఆదేశించడం ఏమిటి అని ప్రశ్నించారు. జూన్ ఆరవ తేదీ నుంచి బడిబాట నిర్వహించి.. విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఆదేశాలకు భిన్నంగా ఈ సర్దుబాటు ఉత్తర్వులు ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. బడిబాట ద్వారా విద్యార్థుల సంఖ్య పెరిగితే.. మళ్లీ టీచర్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
బడిబాట పూర్తయి.. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం విద్యార్థులు ఉన్న బడులను కాపాడుకునే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలన్నారు. గతంలో ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కూడా బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి కారణమైందని ఆరోపించారు. సర్కార్ బడుల్లో టీచర్లు సరిగా ఉండరనే ప్రచారం ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. విద్యార్థులు ఎక్కువగా ఉన్న బడుల్లో తక్కువ మంది టీచర్లు.. విద్యార్థులు తక్కువ మంది ఉన్న బడుల్లో ఎక్కువమంది టీచర్లు ఉండకుండా చూడాల్సిన బాధ్యత పర్యవేక్షణ అధికారులపై ఉందన్నారు. టీచర్ల సర్దుబాటు గడువును పెంచేలా మరో ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.