కేసీఆర్ను అవమానించడమే
లక్ష్యం: దాసోజు శ్రవణ్

- రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియంతృత్వ ధోరణి చూపుతోంది: డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్, జనవరి 31, 2026 (విశ్వం న్యూస్) : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని రాజకీయంగా అవమానించాలనే దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ గారి నివాస గోడలపై సాక్షి నోటీసులు అతికించడం పూర్తిగా అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. CrPC గానీ, BNSS గానీ ఎక్కడా సాక్షి నోటీసులను గోడలపై అతికించే అధికారాన్ని పోలీసులకు ఇవ్వలేదని తెలిపారు. ఇది చట్టబద్ధ విచారణ కాదు… రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనని విమర్శించారు.
ఈ చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లకు భంగం కలిగించడమే కాకుండా, చట్ట పరిరక్షకులుగా ఉండాల్సిన పోలీసులను పాలకుల బానిసలుగా మార్చిన దురదృష్టకర పరిణామమని దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి నోటీసుల పేరుతో ప్రజాస్వామ్యాన్ని బెదిరింపుల పాలనగా మార్చే ప్రయత్నం జరుగుతోందని, ఇది ప్రజాస్వామ్యం కాదు – నియంతృత్వ లక్షణం అని అన్నారు. తెలంగాణ నేడు రాజ్యాంగ హక్కుల అణచివేతకు కేంద్రంగా మారుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే #JaiSamvidhan నినాదం ఎక్కడికి పోయింది?
ఈ అన్యాయంపై దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు స్పందించాల్సిన అవసరం ఉందని డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.