“పట్టెడన్నం కోసం
పసిబిడ్డల ఆర్తనాదాలు”

- సిగ్గు సిగ్గు
- ఇది పాలకుల పాపం
- విద్యార్థులకు శాపం
- అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం
బిడ్డల ఏడ్పులా ! : మాజీమంత్రి కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 31 (విశ్వం న్యూస్) : గురుకుల పాఠశాలలో విద్యార్థినులు పడుతున్న భాదలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. పైడి రాకేష్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గంలోని ఓ గురుకుల విద్యార్థినులు తమకు సరిగా అన్నం కూడా పెట్టడం లేదని కన్నీరుమున్నీరు అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన తెలంగాణ రాష్ట్రంలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నపూర్ణ నా తెలంగాణలో.. బువ్వకోసం బిడ్డల ఏడ్పులా? అంటూ ప్రశ్నించారు.

దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలికేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపాం. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నమో రామచంద్రా అని ఆకలికేకలా ! పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకులాల్లో చదువుకుని ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులు .. నేడు గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోదించడమా ! జాగో తెలంగాణ జాగో