సాయుధ పోరాట యోధుడు పిచ్చిరెడ్డికి శతజయంతి నివాళులు

నాగారం | ఫిబ్రవరి 03 (విశ్వం న్యూస్) : నాగారం మండల కేంద్రానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ యోధుడు, సీపీఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ గుంటకండ్ల పిచ్చిరెడ్డి శత జయంతి ఉత్సవాలను సోమవారం సామాజిక ఆలోచన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సామాజిక ఆలోచన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంగరి వెంకట్రామ్ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పిచ్చిరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పేద ప్రజలు, కార్మికులు, కర్షకుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన యోధుడిగా ఆయన చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని అన్నారు.
1962 నుంచి 1982 వరకు ఉమ్మడి సూర్యాపేట తాలూకా సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి, పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసిన నాయకుడిగా పిచ్చిరెడ్డి విశేష గుర్తింపు పొందారని తెలిపారు. నాగారం మండలంలో సిండికేట్ బ్యాంక్, ఎస్సీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మంజూరుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సామాజిక ఆలోచన వేదిక కార్యదర్శి నీలో శ్రీనివాస్, అంగన్వాడీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండూరి కరుణ, డేగల జనార్ధన్ తదితరులు పాల్గొని కామ్రేడ్ పిచ్చిరెడ్డి సేవలను స్మరించుకొని ఘన నివాళులు అర్పించారు.