
హైదరాబాద్, జూలై 19 ( విశ్వం న్యూస్) : తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ నేతల్లో తిరుగులేని చిచ్చు బయటపడింది. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ నేతగా ఉండి, పక్కనే నడిచే వారిపై కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
“నన్ను ఎదిరించే శక్తి ఉంటే ఎదురుగా రా. నేను శత్రువుతో పోరాడతాను గానీ, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే వాడిని కాదు. బీ కేర్ఫుల్ కొడకా!” అంటూ ఈటల బండి సంజయ్ను ఉద్దేశించి పదుల మాటలతో చురకలు అంటించారు. తనను తక్కువ చేస్తూ కుట్రలు చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలపై ఈటల బహిరంగంగానే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈటల చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో హల్చల్ సృష్టించాయి. ఇప్పటికే పార్టీలో భిన్నాభిప్రాయాలు, గ్రూప్ రాజకీయాలు బహిరంగమవుతున్న వేళ… ఈటల చేసిన విమర్శలు పరిస్థితిని మరింత వేడెక్కించాయి. త్వరలోనే బీజేపీలో పెద్ద బదలాయింపు జరగబోతుందన్న ఊహాగానాలు మధ్య ఈటల వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పార్టీ అధిష్టానం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి గానీ, ఈటల–బండి సంజయ్ మధ్య దూషణల దాకా వెళ్లిన ఈ మాటల యుద్ధం బీజేపీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది అనేది వాస్తవం.