రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి-నల్ల బ్యాడ్జీలతో నిరసనకు పిలుపు

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విశ్వం న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టాలని ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ఎదుట మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.
జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వెల్లడి
ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్, నాన్-గజిటెడ్, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు.
పెండింగ్ సమస్యల పరిష్కారానికి డిమాండ్
రెండో పీఆర్సీ అమలు, 51% ఫిట్మెంట్, పెండింగ్ బిల్లుల విడుదల, నాలుగు డీఏలు మంజూరు వంటి అంశాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రూ.13 వేల కోట్ల బకాయి బిల్లులను విడుదల చేసి పెన్షనర్ల ఇబ్బందులను తొలగించాలని కోరారు.
ఆరోగ్య సేవలు, పెన్షన్ అంశాలు కీలకం
ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డు అమలును కొత్త విధానాలతో మే 1 నుంచి ప్రారంభించాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2004కి ముందు నోటిఫికేషన్ పొందిన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ అమలు చేయాలని సూచించారు.
ప్రభుత్వంపై అసంతృప్తి
ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం లేకపోవడం బాధాకరమని ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హామీలు ఇచ్చినా సమస్యలు పెండింగ్లోనే ఉండటంతో ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.
ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపు
జేఏసీ నిర్ణయానికి అన్ని శాఖల ఉద్యోగులు మద్దతు ఇవ్వాలని, ఈ నెల 17న నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొని తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పిలుపునిచ్చారు.