అజారుద్దీన్ భవిష్యత్తు ఏమిటి..?
సీఎం రేవంత్ ప్లాన్ ఏమిటి

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విశ్వం న్యూస్): తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం లోక్భవన్ (రాజ్ భవన్)లో కీలక సమావేశం కానున్నారు. ఈ భేటీ ప్రధానంగా ఎమ్మెల్సీ నియామకాలపై దృష్టి సారించనుంది.
ఈ సమావేశంలో మాజీ క్రికెటర్, మైనార్టీ నేత మొహమ్మద్ అజారుద్దీన్తో పాటు ప్రొఫెసర్ కోదండ రాం అంశాలు చర్చకు రానున్నాయి. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన కోదండ రాం ఎన్నికపై బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించగా, కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన తన పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ఆయన్ని గవర్నర్ కోటాలో మండలికి పంపాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం.
ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయనకు రాజ్యాంగపరమైన అర్హతను కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసన మండలిలో సభ్యత్వం పొందాల్సిన నిబంధన ఉండటంతో, అజారుద్దీన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని సీఎం యోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇద్దరి పేర్లను గవర్నర్ కోటాలో పరిశీలించాలని సీఎం గవర్నర్ను కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం అజారుద్దీన్కు ఎమ్మెల్సీ మార్గం సుగమమవుతుందా..? కోదండ రాం మళ్లీ మండలిలోకి వస్తారా..? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.