ఆర్టీసీ శంకర్ గౌడ్ కుటుంబానికి
కేటీఆర్ రూ.5 లక్షల
ఆర్థిక సాయం

నర్సంపేట, మే 6 (విశ్వం న్యూస్):ఆర్టీసీ సమ్మె సందర్భంగా తమ హక్కుల సాధన కోసం నర్సంపేటలో ఆత్మబలిదానం చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన, వారి బాధలో భాగస్వామ్యం వ్యక్తం చేస్తూ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

శంకర్ గౌడ్ ఆత్మత్యాగం కార్మిక లోకాన్ని కదిలించిందని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.
ఈ సందర్భంగా శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని కేటీఆర్ అందజేశారు. కుటుంబానికి ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు కేటీఆర్కు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమ కుటుంబానికి న్యాయం జరిగేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.