గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి

కరీంనగర్, మే 6 (విశ్వం న్యూస్):గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్–ఈద్గా–కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి Narendra Modi, కేంద్ర హోంమంత్రి Amit Shah సహా ఇతర కేంద్ర మంత్రులకు తన అభ్యర్థనను తెలియజేశారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ, రైతులు వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్న ఆవులను అంగడి బజార్లకు తీసుకువచ్చి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అలాంటి సమయంలో అధికారులు ఆవులను తిరిగి తీసుకెళ్లాలని సూచిస్తే, కొనుగోలు దారులు ముందుకు రారని, దీంతో వివాదాలు తగ్గే అవకాశముందని పేర్కొన్నారు.
అదేవిధంగా, బక్రీద్ వంటి పండుగల సమయంలో ఆవుల కొనుగోలు–అమ్మకాల విషయంలో కొంతమంది అడ్డుపడి ప్రశ్నించడం వల్ల ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను నివారించాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు.
ఇలా చేస్తే ఆవుల కొనుగోలు తగ్గి, సమాజంలో శాంతి నెలకొనే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు సమాజాల మధ్య సౌహార్దం కొనసాగుతుందని, అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారని ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు.