
హైదరాబాద్, జూన్ 25 (విశ్వం న్యూస్): తెలంగాణలో లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బలహీనపరచి, దశలవారీగా రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన GO Ms No.9 విద్యార్థుల సంక్షేమం కోసం కాదని, తన ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రూపొందించిన రాజకీయ ఎత్తుగడేనని ఆయన విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా కాలేజీలపై భారం మోపడం, విద్యార్థులపై పరోక్ష ఒత్తిడి పెంచడం ద్వారా పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని శ్రవణ్ పేర్కొన్నారు. బకాయిల చెల్లింపుల్లో జాప్యం కారణంగా విద్యాసంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రభుత్వం నిజంగా విద్యార్థుల సంక్షేమాన్ని కోరుకుంటే, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి పథకాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య కలలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.