భట్టి భార్య వసూళ్లు..: సురేఖ సంచలన వ్యాఖ్యలు
పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా?!!

భట్టి భార్య వసూళ్లు..: సురేఖ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సెప్టెంబర్ 3: కాంగ్రెస్ పార్టీలో తనపై జరుగుతున్న పరిణామాలపై మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో స్పందించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్యపై వస్తున్న వసూళ్ల ఆరోపణలు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి సంబంధించిన వివాదాలపై సీఎం రేవంత్రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, ప్రజా ధనంపై ప్రశ్నించిన తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏమిటని నిలదీశారు.
ఢిల్లీలోని గాంధీభవన్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన అనంతరం మీడియాతో సురేఖ మాట్లాడారు. తెలంగాణలో తనపై జరుగుతున్న పరిణామాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్కు సుదీర్ఘ లేఖ పంపినట్లు తెలిపారు. ఆ లేఖను బయటకు విడుదల చేస్తే పలువురికి ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు.
పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ముందుగా సీఎం రేవంత్రెడ్డి నుంచే ప్రారంభించాలని సురేఖ అన్నారు. గతంలో రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని డబ్బులతో కొనుగోలు చేశారంటూ ఆరోపణలు వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. సీఎం నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించడంపై కూడా ప్రశ్నలు సంధించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్కు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, హైదరాబాద్ ఇన్చార్జిగా ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో ఆయన ఫొటోకు చోటు కల్పించడం లేదని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పదవిపైనా సీఎం కన్నేశారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీసీలు అంత తేలిగ్గా తీసుకునే వర్గం కాదని హెచ్చరించారు.
తన కుమార్తె మాట్లాడిన మాటలు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మనసులో ఉన్నవేనని సురేఖ అన్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి కీలక పదవులు ఇస్తూ అసలైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రాజీనామా చేయాలని అధిష్ఠానం కోరితే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.