
హైదరాబాద్, జనవరి 25, 2026 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ పార్టీపై వ్యవస్థబద్ధంగా అవమానకర ప్రచారం చేస్తున్న ABN ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్పై పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే అన్ని రకాల సమావేశాలు, కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు, బహిరంగ సభలకు ABN ఛానల్ ప్రతినిధులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అలాగే ABN టీవీ చర్చల్లో బీఆర్ఎస్కు చెందిన నేతలు ఎవరూ పాల్గొనరాదని పార్టీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల ABN టీవీ చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావుపై ఛానల్ వ్యాఖ్యాత వెంకటకృష్ణ అనుచితంగా వ్యవహరించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రత్యక్ష ప్రసారంలోనే “గెట్ ఔట్ ఫ్రమ్ మై ఛానల్” అంటూ అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు, జర్నలిజం నైతికతకు విరుద్ధమని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన పార్టీ అధిష్టానం, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావుకు వెంకటకృష్ణ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మీడియా వేదికలను వ్యక్తిగత అహంకారానికి వాడుకుంటే సహించేది లేదని హెచ్చరిస్తూ, పార్టీ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని బీఆర్ఎస్ స్పష్టం చేసింది.