బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా

అతివేగం వల్ల బేగంపేట
ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం

హైదరాబాద్, జనవరి 21, 2026 (విశ్వం న్యూస్) : బేగంపేట ఫ్లైఓవర్‌పై బుధవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుమధ్య ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొట్టిన ధాటికి కారు గాల్లోకి లేచి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల సమాచారం ప్రకారం, కారు ఫ్లైఓవర్‌పై అత్యంత వేగంతో ప్రయాణిస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు.

అయితే ప్రమాదం అనంతరం కారు నడిపిన వ్యక్తి వాహనాన్ని అక్కడే వదిలేసి ఘటనా స్థలం నుంచి పరారైనట్లు తెలుస్తోంది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా యజమాని వివరాలను సేకరించి నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఫ్లైఓవర్ నగరం నడిబొడ్డున ఉండటంతో పాటు కార్యాలయాలకు వెళ్లే రద్దీ సమయం కావడంతో ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే మార్గంలో సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు చేశారు. ఫ్లైఓవర్లపై ప్రయాణించే సమయంలో నిర్ణీత వేగ పరిమితిని తప్పనిసరిగా పాటించాలని, మలుపులు మరియు డివైడర్ల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అతివేగమే ఇలాంటి ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరిస్తూ, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *