కంటి వెలుగు ఏర్పాట్లపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్.. పాల్గొన్న హరీశ్ రావు

హైదరాబాద్, జనవరి 16 (విశ్వం న్యూస్) : రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మంలో ఈనెల 18న సీఎం కేసీఆర్ గారు కంటివెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. జనవరి 19న ఉదయం 9 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఖమ్మంలోనే బీఆర్ఎస్ సభ ఏర్పాట్లు చూస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, డీజీపీ అంజనీ కుమార్తో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వీ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మొహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.