వరదలతో జనం అల్లాడుతుంటే…
ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య
ధోరణి ప్రదర్శిస్తుంది:కిషన్రెడ్డి

హైదరాబాద్, జూలై 31 (విశ్వం న్యూస్) : సమష్టి నాయకత్వంతో బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి వస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ఆదుకోవటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. రూ.900 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం నిధులు.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పారు. నేటి నుంచి కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తాయని పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలో కేంద్ర బృందాన్ని మోదీ, అమిత్ షాలు తెలంగాణకు పంపించారని కిషన్రెడ్డి తెలిపారు.
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు సంజీవరావు, శ్రీదేవిలు కిషన్రెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈ క్రమంలోనే గిరిజన రిజర్వేషన్లపై ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సోయం బాపూరావు వ్యాఖ్యలపై బీజేపీ వివరణ కోరుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికారంలోకి రాగానే లంబాడీలకు అండగా ఉంటుందని తెలిపారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గిరిజనులకు అన్యాయం జరిగిందని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు.
జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్లు పెంచాలని కిషన్రెడ్డి పేర్కొన్నారు. సోనియా గాంధీ, కల్వకుంట్ల కుటుంబం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలిసి పని చేస్తున్నాయని విమర్శించారు. దేశం, ప్రజల కంటే ఆ పార్టీలు కుటుంబానికే ప్రాధాన్యతనిస్తాయని మండిపడ్డారు. హస్తం పార్టీ, భారత్ రాష్ట్ర సమితి, ఎంఐఎం.. మూడు పార్టీలు ఒకే తాడు ముక్కలని విమర్శించారు. పొత్తులతో పాటు.. ప్రభుత్వంలో కలిసి పని చేసిన చరిత్ర వాటిదని దుయ్యబట్టారు.