ఏ ‘బందు’ అయినా బిఆర్ఎస్
నాయకులకే:నరేందర్ రెడ్డి

- స్వంతపార్టీ కార్పొరేటరే కలెక్టరుకు ఫిర్యాదు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు, వచ్చే ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెడుతారు: నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ (విశ్వం న్యూస్) : ఏ బందు అయినా బిఆర్ఎస్ పార్టీ నాయకులకే వస్తుందని అది కూడా కొంత మందికే ఇచ్చి అందరికి వస్తుందని భ్రమలు కల్పించి ఓట్లు దండుకొని మరొక సారి మోసం చేయాలని చూస్తున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.దళిత బందు,బిసి బందు,మైనారిటీ బందు ఏదైనా ఇచ్చేది అరకొరనే అని అది కూడా పేదలకు ఇవ్వకుండా బిఆర్ఎస్ నాయకులకు లేదా కమీషన్ ఇచ్చిన వారికి ఇస్తున్నారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
జనాభా ప్రాదిపదికన డివిజన్లలో అర్హులకు ఇవ్వాలని ఎక్కువ మంది ఉన్న డివిజన్లలో కూడా పది పన్నెండు ఇవ్వడమేంటనీ నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు ఆశ చూపి ఓట్లు దండుకొని చేతులెత్తేయడం బిఆర్ఎస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటరే కలెక్టర్ కు ఫిర్యాదు చేసే దుస్థితి దాపురించిందని ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.