
కొండగట్టు, నవంబర్ 30 (విశ్వం న్యూస్) : అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న సుమారు 30 దుకాణాలను మంటలు చుట్టుముట్టి ఒక్కసారిగా దగ్ధమయ్యేలా చేశాయి. ముఖ్యంగా పూజా సామగ్రి, బొమ్మలు, ప్రసాదాల దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి.
సాక్ష్యుల సమాచారం ప్రకారం, మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో వ్యాపారులు ఏమీ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఫైర్ ఇంజన్లు సమయానికి చేరుకోకపోవడం పరిస్థితిని మరింత విషమం చేసింది. ఒక ఫైర్ ఇంజన్ వచ్చినప్పటికీ, అది సరిగా పనిచేయకపోవడంతో మంటలు అదుపు తప్పాయి. అనంతరం కోరుట్ల, కరీంనగర్ నుండి వచ్చిన రెండు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకున్నారు కానీ అప్పటికే ఎక్కువ భాగం దుకాణాలు భస్మీభవించాయి.
వ్యాపారుల అంచనా ప్రకారం, ఈ ప్రమాదంలో కనీసం కోటి రూపాయల పైగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, అగ్నిమాపక శాఖ కలిసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాయి.